పంచ మహాయజ్ఞాలతో పరమ వైభవం
యజ్ఞం అనగానే వేదబ్రాహ్మణులు చేసేది అనుకుంటాం, అయితే ఈ పంచ మహా యజ్ఞాలు ఋత్విక్కులు చేసే యజ్ఞాలు కాదు. శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తీ అను నిత్యం పాటించ వలసిన విధులు.
అవి ఏమిటి? – దేవ, పితృ, భూత, మనుష్య, బ్రహ్మ(ఋషి) యజ్ఞాలు.
- దేవ యజ్ఞం
పూర్వం నిత్యాగ్నిహోత్రులు వుండేవారు. వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనికి ఆహుతం అని పేరు. అలాకాక ఇంట్లో వారందరూ అగ్నికి రావి, మోదుగ, మొదలైన సమిధలు సమర్పించినా ఆహుతం చేసినట్లే. కానీ, ఇదీ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. దానికి బదులుగా నిత్యం దేవుడికి పూజ చేసి ధూపహారతి, కర్పూర హారతి ఇవ్వడం వల్ల దేవతలు తృప్తి చెందుతారు. ఇది దేవయజ్ఞం. సృష్టికి మూల కారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం.
- పితృ యజ్ఞం
మనల్ని కని పెంచి ఇంత వారిని చేసిన తల్లితండ్రులను ప్రేమగా చూడాలి. చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మన అవసరాలెలా తీర్చారో, అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని వుండాలి. ఇలా వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలం. ఇది పితృ యజ్ఞం. మరణించిన తాతముత్తాతలు, మన వంశీయులు.. మనకు పితృదేవతలు. సదా పూజ్యులు. తల్లిదండ్రులు మరణిస్తే వారు మరణించిన తిథిని గుర్తుపెట్టుకుని ఆ రోజున ఆబ్దికం పెట్టి, బంధుమిత్రాదులకు భోజనం పెట్టడం, నిత్యం పితృదేవతలకు తర్పణాలివ్వడం వల్ల వారు తృప్తిచెందుతారు. ఇది కూడా పితృయజ్ఞంలో భాగమే!
- భూత యజ్ఞం
గృహస్తు సర్వప్రాణికోటిమీద దయ కలిగి వుండాలి. పశుపక్షులు, క్రిమి కీటకాదులు మానవుడి మీద ఆధార పడి వున్నాయి. అందుకే మనిషికి భూత దయ వుండాలి. అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట (పక్షులు వచ్చే) ప్రదేశంలో పెట్టాలి. ఇంటి ముందు కుక్కకి, ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి. ఇంట్లో పశువులు వుంటే వాటికి పెట్టాలి. క్రిమి కీటకాల కోసం కొంచెం అన్నం (తినక ముందు) పక్కన పెట్టాలి. (మన పెద్దలు వీటిని పాటించటం మీలో కొందరయినా చూసే వుంటారు). జలాశయాలలో జలచరాలకు కూడా ఆహారం వెయ్యాలి. సర్వ ప్రాణులయందూ దయ కలిగి వుండి ప్రతి నిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారం ఇవ్వాలి.
- మనుష్య యజ్ఞం
మన పెద్దలు అతిధి దేవో భవ అన్నారు. అప్పటివారు ఆతిధ్యం కోరి వచ్చినవారు తమకు తెలియనివారయినా వారిని ఆదరించి సత్కరించేవారు. రోజులు మారినాయి. అయినా ఇంటికొచ్చిన వారిని మన కులం వారా, మన మతం వారా మనకేవిషయంలోనైనా పనికి వస్తారా?లేదా? వగైరాలాలోచించకుండా వారు వచ్చిన సమయాన్నిబట్టి తగు విధంగా గౌరవించాలి. తోటి వారి పట్ల దయ కలిగి వుండాలి. అందరితో సఖ్యంగా వుండాలి. ఎవరైనా సహాయం కోరితే, మనం చెయ్యగలిగితే నిస్వార్ధంగా చెయ్యాలి. ఇదే మనుష్య యజ్ఞం.
- బ్రహ్మ యజ్ఞం
ప్రతి వారూ, ప్రతి రోజూ వేద మంత్రాలు కానీ శాస్త్రాలని కానీ చదవాలి. ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య తక్కువగానీ ప్రతి వారూ ఎవరికి వీలయిన, ఎవరికి ఆసక్తి వున్న, ఎవరికి అనుకూలంగా వున్న శాస్త్రాలను చదవాలి. ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి చూపించాలి. అంతేకాదు. తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి. బ్రహ్మయజ్ఞమంటే.. స్వాధ్యాయం. అంటే వేదాన్ని అద్యయనం చేయడం. కానీ, అది అందరికీసాధ్యమయ్యేది, అవకాశమున్నదీ కాదు. కనుక మహర్షులు మరొక అవకాశాన్నిచ్చారు. ‘వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా’.. రామాయణం సాక్షాత్తూ వేదమే. భారతం పంచమవేదం. భాగవతం వేదమనే కల్పవృక్షం నుంచి జారిపడిన పండు. కనుక మనం రామాయణ, భారత, భాగవత, భగవద్గీతాదులను చదివినట్లయితే స్వాధ్యాయం చేసినట్లే. దీనివల్ల మన రుషులు తృప్తిపడతారు.
ప్రతి మనిషికీ భగవంతుని పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భూత దయ, తోటి మనిషులతో కలిసి వుండే మనస్తత్వం, శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస వున్నాయనుకోండి. ఈ ప్రపంచం ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచయజ్ఞాలు సూచించబడ్డాయి!
యింత వరకు మనం చూసిన ఐదు యజ్ఞాలు – దేవ, ఋషి, పితృ, మనుష్య, భూత యజ్ఞాలు. అంటే – ప్రపంచం లోని – దాదాపు ప్రతి ప్రాణి పట్ల – మన కర్తవ్యం ఏమిటో చూసాము.
ఈ ప్రపంచంలోని అన్ని ప్రాణులూ – వొకటిపై మరొకటి ఆధార పడి ఉన్నదన్న సత్యాన్ని – ఈ యజ్ఞాలు గుర్తు చేస్తాయి.
పంచయజ్ఞాలంటే ఎంతో క్లిష్టతరమైనవని అనుకుంటాంగానీ.. ఇవన్నీ ఎంత సులభమైనవో చూశారు కదా! వీటిని మనందరం బాధ్యతగా నిర్వర్తించినట్లయితే మనకూ మన కుటుంబానికి, సమాజానికి శ్రేయస్సును ప్రసాదిస్తాయి.
సాకి